26/08/2026
సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితం
నర్సాపురం: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చినమైనవానిలంక సమీప సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను అధికారులు, స్థానిక మత్స్యకారుల సహకారంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
కాకినాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వారం రోజుల క్రితం వేటకు సముద్రంలోకి వెళ్లారు. అంతర్వేది సాగర సంగమం సమీపంలో భైరవస్వామికి చెందిన సోనా బోటు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రంలోనే నిలిచిపోయింది. దీంతో మరో బోటులో ఉన్న మత్స్యకారులు తాడు సహాయంతో ఆ బోటును ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
అయితే చినమైనవానిలంక సమీప సముద్రంలో ఇసుక తిన్నెలు తగలడంతో సహాయక బోటుకు కూడా రంధ్రం ఏర్పడింది. దీంతో ఆ బోటు వెనుదిరిగింది. సముద్రంలో అలలు ఉధృతంగా ఉండటంతో ఏడుగురు మత్స్యకారులు బోటులోనే చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న నర్సాపురం పోలీసులు, అంతర్వేది మెరైన్ పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో రక్షణ చర్యలు చేపట్టి ఏడుగురు మత్స్యకారులను బోటుతో సహా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
సముద్రంలో చిక్కుకున్న బోటును పూర్తిగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు, స్థానిక మత్స్యకారులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.