13/08/2026
ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చిన "భార్య"
అన్నమయ్య జిల్లా పీలేరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిద్రమాత్రలు ఇచ్చి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఇనుప రాడ్, రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు.
పీలేరు పట్టణంలోని డిష్ కాలనీకి చెందిన మంగినేని ఉమాదేవి (41)కు, చంద్రగిరి మండలానికి చెందిన చారాల సుబ్రహ్మణ్యం (32)తో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంబంధానికి భర్త మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ అతడిని హత్య చేయాలని పథకం వేసినట్లు వెల్లడించారు.
ఆగస్టు 7 రాత్రి సుమారు 8:30 గంటలకు సుబ్రహ్మణ్యం ఇచ్చిన నిద్రమాత్రలను ఉమాదేవి ఇడ్లీ, సాంబారు, చట్నీలో కలిపి భర్తకు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం రాత్రి 11:30 గంటల సమయంలో భర్త గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించినట్లు చెప్పారు.
ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఇనుప రాడ్, గుండ్రాయితో దాడి చేసి తల పగలగొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య అనంతరం నేరాన్ని రోడ్డు ప్రమాదంగా నమ్మించేలా చేయాలని నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సుమారు 2:30 గంటలకు మృతదేహాన్ని సుబ్రహ్మణ్యంకు చెందిన హోండా యాక్టివాపై తీసుకెళ్లి మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై పడేసినట్లు చెప్పారు.
అనంతరం రక్తపు మరకలు ఉన్న బట్టలు, ఇనుప రాడ్, గుండ్రాయిని గోనె సంచిలో వేసి కట్టకింద ఉన్న కుంటలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.