11/05/2026
కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ :
అంతర్జాతీయ యుద్ధ భయాలు, దేశీయంగా ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు కలిసి భారత స్టాక్ మార్కెట్ను పాతాళానికి తొక్కేశాయి.
క్రూడ్ ఆయిల్ 105 డాలర్ల వద్ద మండుతుండటం, రూపాయి విలువ భారీగా క్షీణించడం ఇన్వెస్టర్లలో గుబులు రేపుతోంది.
ఒక్కరోజే రూ. 5 లక్షల కోట్లు ఆవిరవ్వగా, నిఫ్టీ 23,800 స్థాయిని కాపాడుకోలేకపోతే మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..
సోమవారం ఉదయం నుంచే దలాల్ స్ట్రీట్లో సెగలు కనిపిస్తున్నాయి.
కేవలం గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 5 లక్షల కోట్ల మేర ఆవిరైపోవడం సామాన్యమైన విషయం కాదు.
సెన్సెక్స్ 1200 పాయింట్లు, నిఫ్టీ 1% పైగా పతనమై ఇన్వెస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
ఏదో చిన్నపాటి లాభాల స్వీకరణ అనుకుంటే పొరపాటే.. దీని వెనుక అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ ఆర్థిక పరిణామాలు పెను తుపానులా చుట్టుముట్టాయి.
ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు విడిపోకపోవడం, ముడిచమురు ధరలు సెంచరీ దాటడం మన మార్కెట్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.
మార్కెట్ పతనానికి దారితీసిన ఆ 5 ప్రధాన కారణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.
1) విఫలమైన ఇరాన్-అమెరికా చర్చలు :
మార్కెట్ కోలుకుంటుందని ఆశించిన తరుణంలో ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మళ్ళీ మొదటికొచ్చాయి. ఇరాన్ పెట్టిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం యుద్ధ భయాన్ని రెట్టింపు చేసింది. ఇరాన్ అణు కార్యక్రమం ఇంకా ముప్పుగానే ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అనడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ అనిశ్చితి వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు.
2) ప్రధాని మోదీ 'మితవ్యయం' పిలుపు :
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు మార్కెట్ సెంటిమెంట్ను బలంగా దెబ్బతీసింది.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనొద్దని ఆయన కోరారు.
జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ.. "ఇరాన్ సంక్షోభం కంటే ప్రధాని మోదీ మితవ్యయ పిలుపు మార్కెట్పై ఎక్కువ ప్రభావం చూపింది.
వినియోగం తగ్గితే అది కార్పొరేట్ లాభాల మీద, ఆర్థిక వృద్ధి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇదే ఇప్పుడు మార్కెట్ను భయపెడుతోంది" అని విశ్లేషించారు.
3) భయపెడుతున్న ముడిచమురు ధరలు :
బ్రెంట్ క్రూడ్ ఏకంగా 105 డాలర్ల మార్కును తాకడం భారత్ లాంటి దేశాలకు పెద్ద తలనొప్పి. మనం వాడే చమురులో 85-90 శాతం దిగుమతి చేసుకుంటాం కాబట్టి, ధర పెరిగితే మన కరెంట్ అకౌంట్ లోటు పెరిగిపోతుంది.
హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా నిలిచిపోవడం చమురు మంటకు కారణమైంది.
ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థ వేగాన్ని తగ్గిస్తుందన్న ఆందోళన ఇన్వెస్టర్లలో పెరిగింది.
4) పాతాళానికి పడిపోయిన రూపాయి :
చమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో రూపాయి విలువ భారీగా క్షీణించింది. సోమవారం డాలరుతో పోలిస్తే రూపాయి 94.88కి పడిపోవడం రికార్డు స్థాయి పతనం.
రూపాయి బలహీనపడితే దిగుమతులు ప్రియమవడమే కాకుండా, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) ఇండియన్ మార్కెట్ నుంచి నిధులు తరలించడానికి ఆసక్తి చూపుతారు.
5) సాంకేతిక లోపాలు - సపోర్ట్ లెవల్స్ బ్రేక్ :
సాంకేతికంగా చూస్తే నిఫ్టీ తన కీలక మద్దతు స్థాయి అయిన 24,000 మార్కును కోల్పోవడం ప్రమాద ఘంటికగా మారింది.
ఆక్సిస్ డైరెక్ట్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వీయ అభిప్రాయం ప్రకారం.. "నిఫ్టీ 24,000 వద్ద నిలదొక్కుకోవాలి.
ఒకవేళ 23,800 స్థాయిని కూడా కోల్పోతే మరిన్ని అమ్మకాలు చూసే అవకాశం ఉంది.
మార్కెట్ కోలుకోవాలంటే కనీసం 24,340 పైన ముగియడం అత్యవసరం." రానున్న రోజుల్లో నిఫ్టీ 23,800-24,400 రేంజ్లో ఊగిసలాడే అవకాశం ఉందని టెక్నికల్ అనలిస్టులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే...