28/12/2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా తీపికబురు వినిపించింది. మెడికల్ అన్ఫిట్ అయిన అర్టీసీ ఉద్యోగులకు.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది . ఈ మేరకు శుక్రవారం రోజున ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో 2020 జనవరి ఒకటి తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు.. ప్రత్నామ్నాయ ఉద్యోగాలు కేటాయించనున్నారు.
మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఫిట్నెస్ లేని ఉద్యోగులకు.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వారికి తీపికబురు వినిపిస్తూ.. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మరోవైపు జనవరి1, 2020 తర్వాత మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులలో.. అర్హులైన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పిస్తారు. లేదా అదనపు ఆర్థిక సాయం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.