04/08/2025
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ గారి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం వారు చేసిన పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి
శిబూ సోరెన్ మరణం దేశ అస్తిత్వ, జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిబూ సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు.
శిబూ సోరెన్ గారి మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి తీరని లోటని అన్నారు।
ఈ సందర్భంగా శిబూ సోరెన్ తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
దేశ ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్ చేపట్టిన జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపిందన్నారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపన సమయంలో శిబూ సోరెన్ గారిని హైదరాబాద్లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తు చేశారు.
నాటి తెలంగాణ ఉద్యమానికి వారు తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని కేసీఆర్ గారు గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన శిబూ సోరెన్, తాను ప్రారంభించిన తెలంగాణ మలి దశ ఉద్యమానికి అండగా నిలిచారని కేసీఆర్ తన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా శిబూ సోరెన్ మద్దతుగా నిలిచారని,
జార్ఖండ్ మరియు తెలంగాణ ప్రజల ఉద్యమ విజయాలు... దేశ ఫెడరల్ స్ఫూర్తికి, ప్రాంతీయ, సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని కేసీఆర్ తెలిపారు.
శిబూ సోరెన్ గారి JMM పార్టీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో, 2022లో జార్ఖండ్లో శిబూ సోరెన్ గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
శిబూ సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.