17/07/2026
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన చర్చా వేదిక
• క్షేత్రస్థాయి సవాళ్లపై కార్యకర్తలతో ముఖాముఖి
• పార్టీని ప్రజల్లోకి మరింత పటిష్టంగా తీసుకెళ్తాం
• కైకలూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన
• రైతాంగానికి, ఆక్వా రైతులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందిస్తాం
• కైకలూరు మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
కూటమిగా కలిసి పనిచేస్తున్నప్పుడు చిన్నచిన్న భేదాభిప్రాయాలు రావడం సహజమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే, వాటిని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు రాబోయే రోజుల్లో జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేకుండా, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. బుధవారం కైకలూరు నియోజక వర్గంలో జనసేన చర్చ వేదిక కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “పార్టీ కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న మా పార్టీ కార్యకర్తల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్న ఆలోచనతో 'జనసేన చర్చా వేదిక' కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింత పటిష్టంగా తీసుకెళ్లే వచ్చు. ఈ వేదిక ద్వారా కార్యకర్తలతో నేరుగా ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలు, మండల స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు, క్షేత్రస్థాయి సవాళ్లపై కార్యకర్తల నుంచి నేరుగా అభిప్రాయాలు, విలువైన సూచనలు సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
• సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం
జనసేన చర్చా వేదికలో భాగంగా కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాల్లో కైకలూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చింది. వీటితోపాటు రైతాంగానికి, ఆక్వా రైతులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందించాలని కార్యకర్తలు కోరారు. కార్యకర్తలు లేవనెత్తిన అన్ని సమస్యలపై అధికారుల నుంచి తక్షణమే నివేదికలు తెప్పించుకుంటాం. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా క్షేత్రస్థాయిలో పర్యటించి... స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతాం. ముఖ్యంగా మంచినీటి సమస్యను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా ప్రణాళికాబద్ధంగా, ప్రజలు కోరుకునే విధంగా శాశ్వత పరిష్కారం చూపిస్తాం.
• ప్రతి నియోజకవర్గంలోనూ చర్చా వేదిక
పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపొందించిన 'జనసేన చర్చా వేదిక' కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహిస్తాం. ఈ వేదిక ద్వారా స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి అభిప్రాయాలను నేరుగా సేకరిస్తాం. ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని, పార్టీ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయి. కుప్పకూలిన ఆ వ్యవస్థలను తిరిగి నిలబెట్టడం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడం ఒక్క ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంయుక్త నాయకత్వంలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరి ప్రసాద్, శాసన సభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్సీ శ్రీ జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ చెన్నమల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.