05/06/2026
పత్రికా ప్రకటన
నంద్యాల జిల్లా
05 జూన్, 2026
జిల్లాలో గంజాయి నియంతరణపై ప్రత్యక నిఘా….
జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు...
5 నెలల్లో 8 కేసులు, 23 మంది అరెస్ట్, 23.193 కేజీల గంజాయి సీజ్.. .
యువత భవిష్యత్తును నాశనం చేస్తే కఠిన చర్యలు... జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు.
నంద్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ సునీల్ షొరాణ్, IPS గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా విస్తృత తనిఖీలు చేపడుతున్నామని,పాతనేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం ద్వారా ఈ ఏడాది జనవరి నెల నుండి మే నెల వరకు (గడిచిన ఐదు నెలల్లో) సాధించిన పురోగతిని ఆయన వెల్లడించారు.
స్కూల్ ,కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
గంజాయిని అణచివేయడంతో పాటు, యువత దీని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ గారు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలోని వివిధ కళాశాలల్లో,ముఖ్యమైన ప్రాంతాలలో విద్యార్థులకు,ప్రజలకు గంజాయి మరియు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
జనవరి నుండి మే నెల వరకు (గడిచిన ఐదు నెలల్లో) జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఎస్పీ గారు వెల్లడించారు:
నమోదైన కేసులు: 08
అరెస్ట్ అయిన నిందితులు:-
23 మంది.
స్వాధీనం చేసుకున్న గంజాయి: 23.193 కేజీలు
ఎస్పీ గారి హెచ్చరిక
"గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, లేదా యువతను వ్యసనాల వైపు పురికొల్పినా ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేస్తాం. గంజాయి రవాణా లేదా విక్రయాలకు పాల్పడితే పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయడానికి కూడా వెనకాడం అన్నారు.యువత చెడు అలవాట్లకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని,జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని,సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు స్పష్టం చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయం,నంద్యాల