06/10/2024
అర్హులైన జర్నలిస్టులకే నివేషణ స్థలాలు దక్కాలి..
కరీంనగర్ జర్నలిస్టుల నివేషణ స్థలాల్లో జరిగిన
అక్రమాలపై గొంతు విప్పింది మేమే..
ఆ సంఘం నేతలది ధృతరాష్ట్ర కౌగిలి..
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ :
---------------------------------------------
అర్హులైన జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు రావాలన్నది తమ లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ అన్నారు.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని డబ్ల్యూజేఐ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నివేశన స్థలాల విషయంలో అన్యాయం జరిగిన కరీంనగర్ పట్టణ జర్నలిస్టులకుతమ సంఘం అండగా ఉంటుందన్నారు. వారు చేపట్టే న్యాయపరమైన పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల ముందు కరీంనగర్ పట్టణ జర్నలిస్టులకు నివేషణ స్థలాల కేటాయింపులో జరిగిన అన్యాయం, అక్రమాల విషయంలో తొలుత గళం విప్పింది తానే అన్న విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని యావత్ జర్నలిస్టులకు తామే ప్రతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న ఒక సంఘం నేతలు కరీంనగర్ జర్నలిస్టులకు నివేశన స్థలాల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగినా కనీసం ప్రశ్నించలేకపోయారని ఆరోపించారు.
కళ్ళ ముందు జరిగిన అవినీతి కనిపిస్తున్నా 'ధృతరాష్ట్ర' పాత్ర పోషించిన వారి నైజం బయట పడిందని, అందుకే సదరు సంఘం నేతలను ఎవరు విశ్వసించడం లేదన్నారు. సభ్యులను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం, తద్వారా తమ పబ్బం గడుపుకోవడం ఆ సంఘం నేతలకు పరిపాటిగా మారిందన్నారు.
సభ్యుల ప్రయోజనాల కోసం కొట్లాడే, వారి శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే బాధ్యత డబ్ల్యూజేఐ తీసుకుంటుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జర్నలిస్టులు డబ్ల్యూజేఐలో చేరడం ద్వారా తమ కోసం పనిచేసే నాయకత్వానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. హుజురాబాద్ జర్నలిస్టుల నివేషణ స్థలాలకు విద్యుత్ కనెక్షన్ల విషయంలో తమ పోరాటం తప్పక ఉంటుందన్నారు.
డీజేయు నుండి... :
సభ్యత్వ నమోదులో భాగంగా డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు ఆడెపు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆ సంఘానికి రాజీనామా చేసి డబ్ల్యూజేఐ సభ్యత్వం తీసుకున్నారు. తొలిరోజే సుమారు 50 మంది జర్నలిస్టులు తమ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం డబ్ల్యూజేఐ నాయకత్వం పట్ల వారికి ఉన్న నమ్మకానికి నిదర్శనమని కరుణాకర్ అన్నారు.