14/09/2025
ఎరువులు ఉచితం!
అజొల్లా విత్తనం వేస్తే చాలు... వారంలో ఆ పొలమంతా పచ్చగా పరుచుకుని టన్నుల కొద్దీ ఎరువుగా మారుతుంది. ఇక అక్కడ నుంచి రోజూ రెండు కేజీల చొప్పున నత్రజనినీ, ఇతర ఎరువులనీ పంటపొలాలకు అందిస్తుంది. ఈ మొక్క పొలంలో ఉంటే ఏడాదికి 450 కేజీల నత్రజనితోపాటు ఇతరత్రా ఎరువులు ఉచితంగా అందినట్లే: అందుకే దీన్ని 'లివింగ్ బయో ఫెర్టిలైజర్ అంటారు. వియత్నాం, చైనా దేశాలు రసాయన ఎరువులకు బదులుగా పందల ఏళ్లుగా ఈ మొక్కని వరిపంటలో ఎరువుగా ఉపయోగిస్తున్నాయి. 'ఈ మొక్కతో ఎరువులకయ్యే ఖర్చు మాత్రమే కాదు... కలుపు మొక్కల నివారణకయ్యే ఖర్చులూ కలిసివస్తాయి. ఎందుకంటే అజొల్లా ఉన్న చోట కలుపు మొక్కలు పెరగవు, దోమలు దరిచేరవు. వరిలో దీనిని అంతరపంటగా వేయడం వల్ల రైతులకు సాగు వ్యయం తగ్గి పంట దిగుబడి 20 శాతం పెరుగుతుంది అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
పెరట్లోనే దాణా
వ్యవసాయం చేసే రైతులకి మాత్రమే అజొల్లా ప్రయోజనాలు పరిమితం అనుకుంటే పొరపాటు, పాడి, పౌల్ట్రీ, ఆక్వా రంగాల్లో ఉండేవారికి ఈ మొక్క ఎంతో మేలు చేస్తుంది. పశువులూ, కోళ్లూ, చేపల్లాంటి వాటిని పెంచాలంటే రైతులు దాణాకే ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ అజొల్లాని దాణాగా ఉపయోగించడం వల్ల 60శాతం ఖర్చు తగ్గుతుందట. ఎందుకంటే ప్రొటీన్లూ, అమైనో ఆమ్లాలూ పుష్కలంగా ఉండే ఈ మొక్కలని ఆవులూ, గేదెలతోపాటు చేపలూ. కోళ్లూ, మేకలూ, కుందేళ్లూ ఇష్టంగా తింటాయి. బయట కిలో దాణా ఖర్చు రూ.80 రూపాయలుంటే కిలో అజొల్లాని పెంచడానికి రూపాయిలోనే ఖర్చు అవుతుంది. ఈ మొక్కని పెంచుకోవడం కష్టం కూడా కాదు. పెరట్లోనూ, దాబా సైనా, కుంటల్లో, కుండీల్లో ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు.. అందుకే కేరళ, తమిళనాడుల్లో పెద్దఎత్తున ఈ మొక్కని సాగుచేస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, కామారెడ్డి ప్రాంతాల్లోని రైతులు అజొల్లాని సాగులో భాగం చేసుకుంటున్నారు. స్టార్టప్ కంపెనీల్లో కొన్ని.... దీన్ని రెడీమేడ్ ఎరువుగా మార్చి ఆన్లైన్లో అమ్ముతుంటే, మరికొన్ని జీవ ఇంధనంగా మార్చి కార్పొరేట్ కంపెనీలకు అమ్మి పెద్దఎత్తున లాభపడుతున్నాయి. ఈసాగు పట్ల ఆసక్తి పెరగడంతో ప్రభుత్వాలు కూడా విత్తనాలు కొనడానికీ, ప్లాస్టిక్ షీట్ల కొనుగోళ్లకీ మహిళలకు రాయితీలు ఇచ్చి ప్రోత్స హిస్తున్నాయి. మొక్క చిన్నదే కానీ ప్రయోజనాలు ఘనం.