29/05/2026
*రోడ్డు వెడల్పు పేరిట మా ఆస్తికి నష్టం*
- గుర్రుమంటున్న గార్డెన్స్ వాసులు
మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని వెడల్పు చేసే ఉద్దేశ్యంతో మా ఆస్తికి నష్టం కలిగిస్తున్న జీఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక బృందావన్ గార్డెన్స్, మెయిన్ రోడ్డులోగల స్థల యజమానులు మరియు స్వాధీనదారులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
జి.ఎం.సి. మాస్టర్ ప్లాన్ ప్రకారం బృందావన్ గార్డెన్స్ సెంటర్ ఎన్.జి. రంగ విగ్రహం నుండి స్తంభలగరువు సెంటర్ చేబ్రోలు హనుమయ్య విగ్రహం వరకు ఉన్న రోడ్డును విస్తరించాలని మున్సిపల్ ప్రణాళికా శాఖ సిబ్బంది మమ్మల్ని సంప్రదించి, ప్రతిపాదించినట్లు తెలియజేశారు.
వారు మా ప్రహరీ గోడను గుర్తించి, మా కట్టడాలను స్వచ్ఛందంగా కూల్చివేయమని కోరినట్లు తెలిపారు. అలా చేయని పక్షంలో, బలవంతంగా మా కట్టడాలను కూల్చివేస్తామని జీఎంసీ అధికారులు మమ్ములను బెదిరిస్తున్నారని బాధను వ్యక్తం చేశారు .
ఎన్.జి. రంగ విగ్రహం నుండి కుందుల రోడ్డు వరకు ఇప్పటికే 80 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉందని చెప్పారు. మా షాపు గోడలు కూల్చివేసి, స్వాధీనం చేసుకుని దానిని వెడల్పు చేయవలసిన అవసరం లేదని అన్నారు. మేము ఎంత నచ్చజెప్పినా జీఎంసీ అధికారులు మా మోర వినడం లేదని, మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎన్.జి. రంగ విగ్రహం నుండి చెబ్రోలు హనుమయ్య విగ్రహం వరకు ఉన్న రోడ్డు 80 అడుగుల వెడల్పుతో ఉండాలని ప్రతిపాదించబడిందని తెలిపారు. 2026 సంవత్సరపు డబ్ల్యూ.పి. దాఖలు చేశామని చెప్పారు. ఎస్.ఆర్.ఓ. ఫైల్లో నమోదు చేయబడిన మా పత్రాల ప్రకారం, నల్లపాడులో, ఉత్తరం వైపు ఉన్న రహదారి 80 అడుగుల వెడల్పుతో ఉందని చెప్పారు.
మరియు ఎన్.జి. రంగ విగ్రహం నుండి కుందుల రోడ్డు వరకు ఉన్న ప్రస్తుత రహదారి కూడా 80 అడుగుల వెడల్పుతోనే ఉందని తెలిపారు. మా ఆస్తికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, రహదారికి ఉత్తరపు అంచున కాలువ వేస్తే సరిపోతుందని సూచించారు. ఒకవేళ అధికారులు రహదారిని 80 అడుగులకు మించి వెడల్పు చేయాలనుకుంటే, వారు చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ మాధవరావు, గడ్డంశెట్టి సత్యనారాయణ, ఎండీ అజీజ్ అహ్మద్, పోకూరి మణికంఠ చంద్ర శేఖర్, తాళ్లూరు వెంకట చంద్ర శేఖర్, ఎండీ ముభాషిర్ అహ్మద్, జాగర్లమూడి సుజాత, గోగినేని జ్యోతి కుమారి, కుందా ఇందిరా రాణి, తోటకూర వెంకట రమణ, ప్రతీతి లావణ్య, ప్రత్తిపాటి విజయశంకర్, పాపినేని శేషగిరిరావు, కొసరాజు సత్య కిరణ్, కొసరాజు నీహారిక, మురికిపూడి అమర్ జనార్దన్ కుమార్, అదిగోపుల రవితేజ, ఎండీ ఫరూక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.