16/05/2026
శ్యామలకి అండగా నిలిచిన నిర్మాత దిల్ రాజు..
పూర్తి వైద్య చికిత్సకు భరోసా
ప్రముఖ హాస్య నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వార్తలు సినీ వర్గాలను కలచివేశాయి. గుండె సంబంధిత వ్యాధితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల, నిన్న రాత్రి చికిత్స నిమిత్తం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అయితే వైద్య చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో ఆసుపత్రి వారు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారని వార్తలు వచ్చాయి.
అర్థరాత్రి సమయంలో ఓ క్యాబ్ డ్రైవర్ శ్యామలను వై జంక్షన్ ఫుట్పాత్ వద్ద దింపి వెళ్లిపోయాడని, అక్కడ ఆమెను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిసింది. అనంతరం పోలీసులు పావలా శ్యామలను ఆర్కే ఫౌండేషన్కు తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ సమాచారం తెలుసుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించారు. తన మేనేజర్ల ద్వారా శ్యామల ప్రస్తుతం కూకట్పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారని ట్రేస్ చేయించి తెలుసుకున్నారు. అనంతరం దిల్ రాజు స్వయంగా ఆసుపత్రి వైద్యులను ఫోన్లో సంప్రదించి శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా డాక్టర్ దిల్ రాజుకు వివరించిన సమాచారం ప్రకారం…
మరో ప్రైవేట్ ఆసుపత్రి వారు శ్యామలకు చికిత్స నిరాకరించి బయటకు పంపించారని, అనంతరం నిన్న రాత్రి ఆమెను తీవ్ర కడుపునొప్పితో తమ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో చేర్చుకున్నామని తెలిపారు.
పరీక్షల్లో శ్యామల గాల్బ్లాడర్లో సమస్య ఉన్నట్లు గుర్తించామని, abdomen CT Scan మరియు Ultrasound పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అలాగే abdominal creatinine స్థాయిలు అధికంగా ఉన్నాయని, ఇప్పటికే ఆమెకు cardiac issues కూడా ఉన్నాయని వెల్లడించారు.
ప్రస్తుతం తల నుంచి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, 2D ECO మరియు stomach scan కూడా చేసినట్లు తెలిపారు. రిపోర్టులు వచ్చిన తరువాత పరిస్థితిని బట్టి కేవలం medical managementతో చికిత్స కొనసాగించాలా, లేక surgical management అవసరమా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని డాక్టర్లు వివరించారు.
డాక్టర్లతో మాట్లాడిన దిల్ రాజు, “శ్యామల గారికి పూర్తిస్థాయి చికిత్స అందించండి. అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. మా మేనేజర్లు మీతో టచ్లో ఉంటారు. నేను కూడా ఎప్పుడైనా ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటాను” అని భరోసా ఇచ్చినట్లు సమాచారం.