19/02/2021
నాలుగో రోజూ మార్కెట్లకు నష్టాలే..!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండడం సూచీలను కిందకు లాగాయి. శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. నిరుద్యోగం పెరిగిపోయిందన్న సంకేతాలతో అమెరికా మార్కెట్లు తద్వారా ఆసియా మార్కెట్లు క్రితం సెషన్లో డీలా పడ్డాయి. దీంతో ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ సూచీలు అదే ట్రెండ్ను అందిపుచ్చుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.55 వద్ద నిలిచింది. సెన్సెక్స్ ఉదయం 51,178 వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 50,636 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 434 పాయింట్ల నష్టంతో 50,889 వద్ద ముగిసింది. అదే ట్రెండ్ను కొనసాగించిన నిఫ్టీ.. 15,074 వద్ద ప్రారంభమై.. చివరకు 137 పాయింట్లు నష్టపోయి 14,981 వద్ద స్థిరపడింది. అయితే, కొన్ని కీలక కంపెనీలు స్వల్ప వ్యవధిలో రాణించడంతో నిఫ్టీ ఉదయం స్వల్ప కాలం పాటు లాభాల్లో ట్రేడయి 15,139 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.
ఇంధన, ఐటీ రంగాల సూచీలు స్వల్పంగా ఎగబాకాయి. దాదాపు మిగిలిన రంగాల సూచీలన్నీ నష్టాల్లోనే ముగిశాయి. అత్యధికంగా ఆటో రంగ సూచీ 2.46 శాతం, పీఎస్యూ 1.90 శాతం, బ్యాంకింగ్ 1.84 శాతం నష్టాల్ని మూటగట్టుకున్నాయి. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గెయిల్ ఇండియా, హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాలను ఒడిసిపట్టగా.. ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ, టాటా మోటార్స్ లిమిటెడ్ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.