
17/06/2025
#ఎస్సీ_ఎస్టీ_బెస్ట్_ఎవైలబుల్ స్కూళ్ల బకాయిలు రూ.154 కోట్లను తక్షణం విడుదల చేయాలి.*
-- *తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్ లు డిమాండ్ చేశారు.*
*-26 వేల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం*
దళిత,గిరిజన పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదివేందుకు గత 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన బెస్ట్ ఎవైలబుల్ పథకం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుందన్నారు.వివిధ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన ప్రైవేట్ స్కూళ్లలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రభుత్వం చెల్లించే ఫీజులతో ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పథకానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 20 వరకు పాఠశాలలు తెరిచే పరిస్థితి లేదని ప్రకటించాయన్నారు. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్చలు జరిపి బకాయి పడ్డ 154 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే బడా కాంట్రాక్టర్లు,రాజకీయ నాయకులకు చెల్లించాల్సిన వేలకోట్ల రూపాయల బిల్లులను ఆగమేఘాల మీద చెల్లించిందన్నారు.కానీ పేద దళిత గిరిజన విద్యార్థులు చదువుతున్న ప్రైవేట్ స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించకపోవడం దళితులు గిరిజనుల పట్ల తీవ్ర వివక్ష పాటించడమేనన్నారు. బెస్ట్ అవైలబుల్ క్రమంగా నిర్వీర్యం చేసి పూర్తిగా రద్దు చేయాలని కుట్రలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వం రెండేళ్లుగా ఫీజులు చెల్లించకపోవడంతో స్కూళ్ల యాజమాన్యాలు ఆర్థిక భారం పడుతోందని విద్యార్థులను స్కూళ్లల్లోకి విద్యార్థులను రానీయకుండా కొత్త అడ్మిషన్లు సైతం నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం గత అనేక సంవత్సరాలుగా అమల్లో ఉండడం వలన వేలాదిమంది దళిత గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రవేట్ కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందే స్థాయికి వెళ్లారని అన్నారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 180 ప్రైవేటు స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ విద్యా ర్థులు 26 వేల మంది చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదికి డే స్కాలర్ కు రూ.28 వేలు, రెసిడెన్షియల్ కు రూ.42 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. తక్కువ ఫీజులోనే చదువు, భోజనం, దుస్తులు, పుస్తకాలు, వసతి కల్పి స్తున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రైవేటు స్కూళ్లకు చెల్లించాల్సిన రూ.154 కోట్లను చెల్లించాలని లేకపోతే దళిత గిరిజన సంఘాలు, విద్యార్థిసంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు.
అభివందనములతో..
ఆర్ శ్రీరాం నాయక్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం