09/08/2013
స్పష్టత తర్వాతే విభజన..!
రాష్ట్ర విభజనపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. విభజన జరగకుండా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించి.. అధిష్టానం నిర్ణయంతో అలకబూనిన సీఎం ఇవాళ సచివాలయంలో మనసు విప్పి సుధీర్గ్ఘంగా మాట్లాడారు. విభజన అంశంపై స్పందించడానికి ముఖ్యమంత్రికి 9 రోజులు పట్టిందంటే.. ఆయన ఏ రేంజ్ లో హర్టయ్యారో అర్థమవుతుంది. ఇటు అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని చెబుతూనే.. అధినేత్రికి పలు ప్రశ్నలు స్పందించారు. అయితే, రాష్ట్ర విజనకు భీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డే అని స్పష్టం చేయడం విశేషం.
రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయని, ఇప్పుడా సమస్యలపైనే తాము దృష్టి సారిస్తామని సీఎం చెప్పారు. కోట్లాది రైతుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీటి పంపకాల అంశమే ఇప్పుడు అందరి మధ్య ఉన్న ప్రధాన సమస్య ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్ర ప్రాంతంలో 35 లక్షల ఎకరాలు సాగుబడిలో ఉన్నాయని, విభజన అనంతరం వాటికి నీరు అందించే విషయమై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ఇరుప్రాంతాల మధ్య నీటి పంపిణీల్లో విభేదాలు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, సీమాంధ్రలో ఉద్యమం గురించి మాట్లాడుతూ.. రాష్ట్రం ఎంతో ఎత్తుకెదగాలని ఆశించిన రాజీవ్ గాంధీ, తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని ఎలుగెత్తిన ఇందిరమ్మ, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కొమ్ముకాసిన నెహ్రూల విగ్రహాలను కూల్చడం దురదృష్ట కరం అని సీఎం అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ఉద్యమకారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, మొదట్లోనే వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చామని సీఎం స్పష్టం చేశారు. విభజనపై తలెత్తే ఆందోళనపై అధిష్టానం ఆంటోనీ నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటు చేశామని, విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఎవరైనా తమకున్న సమస్యలు సందేహాలను ఈ కమిటీకి నివేదించుకోవచ్చని సూచించారు.
రాష్ట్రంలో చాలాకాలం తర్వాత సంవృద్ధి వర్షాలు కురిశాయని, వ్యవసాయానికి అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ దశలో ఉద్యోగులు సమ్మెలు చేసేందుకు సిద్ధపడటం, రైతుల సన్నద్ధతను దెబ్బతీస్తుందని కిరణ్ వివరించారు. అంతేకాకుండా.. సోమశిల, కండలేరు మినహా అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని, 145 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని.. ఇలాంటి దశలో ఉద్యోగులు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు.
రాష్ట్ర విజనకు భీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డేనని.. 2002లో ఆయన ఎమ్మెల్యేలతో తెలంగాణ ఫోరం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక టీడీపీ కూడా 2008లో తెలంగాణకు మద్దతిస్తున్నట్టు తెలిపిందని వెల్లడించారు. ఎంఐఎం, సీపీఎం పార్టీలు తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని… తీరా ప్రకటన చేసిన తర్వాత దొంగనాటకాలకు తెరదీస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తాను విభజనకు వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదు అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు విభజనకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలున్న లేఖపై తానూ సంతకం చేశానంటూ చెబుతూనే.. అది పార్టీ వ్యవహారమని సర్ది చెప్పుకొన్నారు.
మొత్తంగా ముఖ్యమంత్రి విభజనపై అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆచితూచి స్పందించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని సమర్థిస్తూనే.. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించే ప్రయత్నం చేశారు. చాలాకాలం తర్వాత సీఎం ప్రజల ముందుకు రావడంతో.. రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన సమైక్యవాదుల స్టార్ బ్యాట్స్ మెన్ గా మళ్లీ బ్యాటింగ్ కు దిగే అవకాశాలున్నాయి సీమాంధ్ర నేతలు తెగ సంబరపోతున్నారని సమాచారం.