21/01/2026
*తాజా మాజీ కౌన్సిలర్లకు కష్టకాలం… కొత్తవారికే పట్టణ ప్రజల మద్దతు!*
పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తాజా మాజీ కౌన్సిలర్లకు గట్టి ఎదురుదెబ్బ తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో పదవులు నిర్వహించిన సుమారు 30 మంది మాజీ కౌన్సిలర్లలో ఈ ఎన్నికల్లో 20 మందికిపైగా గెలిచే అవకాశాలు లేవన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
అంతేకాకుండా 3 నుంచి 4 మంది మాజీ కౌన్సిలర్లు ఈసారి ఎన్నికల బరిలోకి దిగడం లేదన్న సమాచారం గమనార్హం.
గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పనుల కంటే హంగులు, ఆర్భాటాలు, వర్గపోరులకే పరిమితమయ్యారన్న ఆరోపణలు తాజా మాజీ కౌన్సిలర్లపై వెల్లువెత్తుతున్నాయి. వార్డుల అభివృద్ధిలో స్పష్టమైన ఫలితాలు కనిపించలేదన్న అసంతృప్తి పట్టణ ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మున్సిపల్ రిజర్వేషన్ ప్రక్రియలో చాలా మంది మాజీ కౌన్సిలర్లు అవకాశాలు కోల్పోయినట్లు సమాచారం. తప్పక పోటీ చేసి గెలవాలని భావిస్తున్న కొందరు అభ్యర్థులు ఇతర వార్డుల్లో తమ గెలుపు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న భావన పట్టణ ప్రజల్లో బలపడుతోంది. అలాగే గతంలో ఓటమి ఎదురైనా, నిరంతరం వార్డులకు సేవ చేసిన అభ్యర్థుల వైపుకూడా ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొత్తం మీద ఈ ఎన్నికలు తాజా మాజీ కౌన్సిలర్లకు కఠిన పరీక్షగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.