21/01/2026
కోనసీమకు 216ఇ జాతీయ రహదారి వస్తుంది
రూ.630 కోట్లు మంజూరు
56 హెక్టార్లు భూసేకరణ
31.6 కిలోమీటర్లు 22 గ్రామల మీదుగా హైవే
కొత్తపేట,రావులపాలెంతో సంబంధం లేకుండా
రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లాలంటే దూరం తక్కువ అయినప్పటికీ ప్రయాణం ముందుకు సాగదు. ఇరుకైన రోడ్లు, ప్రమాదకరమైన అనేక మలుపులు,కాలువ వంతెనలు. అస్సలు కోనసీమ ప్రాంతానికే ఇప్పటివరకు జాతీయ రహదారి లేదు. తూర్పు వైపు నుండి కత్తిపూడి-పామర్రు 216 జాతీయ రహదారి వెళ్తుంటే పశ్చిమ వైపున రాజమండ్రి-ఏలూరు 216ఎ నేషనల్ హైవే వెళ్తుంది. మధ్యలో మాత్రం ఈ రెండింటికి అనుసంధానం లేదు.ఇప్పుడు ఈ రెండు రోడ్లను కలుపుతూ 216ఇ పేరుతో జాతీయ రహదారి వస్తుంది. ఇందుకు రూ. 630 కోట్లు కేంద్ర ఉపరితల మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. భూసేకరణకు సంబంధించి ఈనెల 8న నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 28 నాటికి చెప్పుకోవాల్సి ఉంది. 22 గ్రామాల పరిధిలో 727 మందికి చెందిన రైతులు, గృహ యజమానులు నుంచి 55.98 హెక్టార్ల భూమిని సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును కొంతమేర విస్తరిస్తుండగా మరికొంత గ్రీన్ ఫీల్డ్ హైవే (పొలాల మధ్య నుంచి కొత్త రోడ్డు) నిర్మాణం చేపడతారు.
అన్నిటికంటే ప్రధానంగా ట్రాఫిక్ సమస్యతో ఊపిరి సలపకుండా ఉండే కొత్తపేట, రావులపాలెం రోడ్లుకు ఉపశయనం కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కొత్తపేట గ్రామంలో ప్రవేశించకుండా పలివెల వంతెన నుంచి నేరుగా వెదిరేశ్వరం మీదుగా జాతీయ రహదారిని కలుస్తుంది. ఈ రోడ్డు అమలాపురం ఈదరపల్లి వంతెన నుండి మెసలపల్లి, ముక్కామల, అవిడి,ఖండ్రిగ, పలివెల, వెదిరేశ్వరం మీదుగా హైవేను 31.6 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల దూరం భారం కూడా తగ్గనుంది. ఆధునిక టెక్నాలజీతో ఈ నిర్మాణం చేపట్టనున్నందున తరుచూ గోతులు పడి రోడ్డు అద్వానంగా మారే అవకాశాలు అంతగా ఉండవు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంగా ఉన్న అమలాపురం చేరుకోవడానికి అందరికీ ఎంతో సులభంగా ఉంటుంది. అంటే అమలాపురం నుంచి విజయవాడ వెళ్లాలన్నా రాజమహేంద్రవరం వెళ్లాలన్నా జాతీయరహదారి పైనే ప్రయాణం చేయవచ్చు. అందువల్ల రాకపోకలకు ఎంతో సులభతరం అవుతుంది. సకాలంలో రోడ్డు నిర్మాణం పూర్తయితే కూటమి ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.