18/08/2017
అందరి చూపు... నంద్యాల వైపు...
గెలుపు ఎవరిదని సర్వత్రా ఆసక్తి
విచారణ, విశ్లేషణల్లో రాష్ట్ర ప్రజలు
నంద్యాల
(కర్నూలు జిల్లా): ఉదయం నిద్ర లేచింది మొదలు నంద్యాల వాసుల ఫోన్లు రింగవుతూనే ఉంటున్నాయి. కారణం ఈనెల 23న జరగబోయే ఉప ఎన్నికల పోలింగే. దూరపు బంధువులు.. స్నేహితులు..సహచర ఉద్యోగులు.. మీడియా ప్రతినిధులు ఇలా ఈ స్థానంలో ఎవరు గెలుస్తారంటూ ఆసక్తితో ఫోన్లు చేస్తున్నారు. మరికొందరు బెట్టింగ్కు దిగేందుకు ఉప ఎన్నిక ఉత్కంఠŒలో గెలుపు ఎవరి పక్షమో.. సాధ్యాసాధ్యాలు ఏమిటో తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సామాజిక వర్గ ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ఇక్కడి ఓటర్లలో ప్రధానంగా ముస్లిం-మైనార్టీ, కాపు-బలిజ, వైశ్య, ఎస్సీ, రెడ్డి.. సామాజిక వర్గాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఎంత శాతం చూపుతున్నారు? అనేదానిపై విచారణలు, విశ్లేషణలు సాగుతున్నాయి. ఒక్క జిల్లా నుంచి మాత్రమే కాదు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడ్డ ఆంధ్రావాసుల నుంచి స్థానికులకు ప్రశ్నల వర్షం కురుస్తోంది.
రోజురోజుకీ పెరుగుతున్న ఆసక్తి
ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే చంద్రబాబు నంద్యాలకు రెండుసార్లు రావడం.. రూ.వందల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ తరుణంలో ఏళ్లనాటి కలగా మిగిలిన రహదారుల విస్తరణకు మోక్షం కలగగానే తెదేపాకు గెలుపు అవకాశాల మెరుగుపై ఫోన్లలో విచారణ మొదలైంది. కొన్నిరోజుల తర్వాత జగన్ నిరంతర ప్రచారం చేపట్టడంతో ఆసక్తిపరులు మళ్లీ విచారణ చేపట్టారు. ఎంత శాతం ఓట్లు మారే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారు? అంటూ రోజురోజుకి ఆసక్తిగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లోని ప్రజలు విచారణ చేస్తున్నారు. బుధవారం సినీహీరో బాలకృష్ణ రోడ్షో, రోజా మాటల యుద్ధంతో నంద్యాలలో ఏం జరుగుతుంది? గెలుపు ఎటువైపు? అన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొందరైతే ఫోన్లలో కాకుండా నేరుగా నంద్యాల వచ్చి, రెండు మూడు రోజలు ఉండి మరీ సమాచారం తెలుసుకుని వెళుతున్నారు.
పందేల గోదా
క్రికెట్ బెట్టింగ్లను తలపిస్తోంది నంద్యాల ఉప ఎన్నిక బెట్టింగ్ ఫీవర్. జయాపజయాలపై ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పందేల జోరు పెరిగిపోయింది. ప్రస్తుతం ఒకటికి ఒకటి చొప్పున రూ.కోట్లల్లో పందేలు కాస్తున్నారు. ఉత్కంఠ పోరులో కీలకంగా మారిన మెజార్టీపై అయితే రెండుకు ఒకటి చొప్పున పందేలు జోరందుకున్నాయి. ఈ పందెంలో రాజకీయ నాయకులు, వ్యాపారులతోపాటు ఉద్యోగులు కూడా ముందు వరుసలో ఉండి బెట్టింగ్ కాస్తున్నారు. పందేలకు దిగినవారు ఇక తెదేపా-వైకాపాల్లో ఏది గెలుస్తుందని వారివారి అవకాశాలను బట్టి నంద్యాలలో పరిస్థితి ఫోన్లలో ఎప్పటికప్పుడు తెలుసుకుని తృప్తి చెందుతున్నారు. ఇక బెట్టింగ్లలో కూడా దళారులదే హవా. ఇరుపార్టీల నాయకుల వద్దకు వెళ్లి పందేలున్నాయి... పందేనికి సిద్ధంగా ఉండండి అంటూ ఇరువురి వద్ద రెండు శాతం కమీషన్ మాట్లాడుకుంటున్నారు. దీంతో రోజులు గడిచే కొద్దీ నవ నందుల గడ్డ వైపు అందరిచూపు మళ్లుతోంది.