24/12/2025
తమ హక్కులపై వినియోగదారులకు అవగాహన అవసరం....
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి
ప్రశ్నించడంతోనే అధిక ధరలు, కల్తీ ఆహారాలు, తూకాల్లో మోసాలకు చెక్
సేవల్లో లోపం జరిగితే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలి
జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు
ప్రయోక్త : జిల్లా పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వినియోగదారుల అవగాహన సదస్సు జరిగింది.
నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు.
డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ వినియోగదారుల దినోత్సవానికి "డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం" అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న డిజిటల్ కొనుగోళ్ల లో వినియోగదారులు మోసపోకుండా ఉండటమే కాకుండా తమ హక్కుల గురించి గుర్తెరగాలన్నారు. అధిక ధరలు, నాణ్యత, కల్తీలు, వస్తు సేవల్లో లోపం మొదలైన అంశాలను వినియోగదారులందరూ ప్రశ్నిస్తేనే ఇలాంటివి తిరిగి జరగకుండే ఉండే అవకాశం ఉంటుందన్నారు. వినియోగదారులకు సేవాలోపం జరిగితే వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చుననే అవగాహన ముఖ్యమన్నారు. ఒక్క రూపాయి నుంచి ఎంత పెద్దమొత్తంలో కొనుగోలుచేసినా బిల్లులు తప్పనిసరిగా పొందాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్నప్పటికీ, సమాజంలో సరైన అవగాహన తోనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునన్నారు. డిజిటల్ విధానంలో ఈ-జాగృతి పోర్టల్లో వినియోగదారులు తమకు జరిగిన సేవాలోపాన్ని నమోదుచేసి న్యాయసహాయం సులభంగా పొందవచ్చన్నారు.
ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల గురించి నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జాయింట్ కలెక్టర్, అధికారులు జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు.
అనంతరం వినియోగదారుల చట్టంపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో డిఎస్ఒ లీలారాణి, జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యులు ప్రశాంతి, ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కంట్రోలర్ వెంకటేశ్వరరావు, తునికలు కొలతలు శాఖ డిప్యూటీ కొంట్రోలర్ ఐజాక్, ఆర్టివో బషీర్, డిఎంఅండ్సెచ్వి సుజాత, ఎఎసివోలు సి. లక్ష్మీ నారాయణరెడ్డి, ఐ.పుల్లయ్య, డికె జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం రమణారెడ్డి, పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.