22/02/2026
నూటా పదకొండు(111) సంవత్సరాల చరిత్ర ఉన్న రాజంపేట(లో) శతవసంతాల వేడుకలకు కరువు..!
రాజంపేట ఫిబ్రవరి 18: శతవసంతాలు ఆపై మరో 11 సంవత్సరాలు పూర్తిచేసుకున్నా రెవెన్యూ డివిజనల్ స్థానం సంపాదించుకున్న రాజంపేట రెవిన్యూ డివిజన్ ఎటువంటి వేడుకలకు నోచుకోకపోవడం ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.. రాజంపేట తాలూకా కార్యాలయాన్ని తొలుతగా 1888లొ ప్రారంభించారు. బ్రిటిష్ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో రాజంపేట పట్టణం వృద్ధి చెందడంతో, రైల్వే స్టేషన్ (1890 లో) ప్రభావంతో తాలూకా కార్యాలయాన్ని ఇక్కడికి మార్చారు. ఇది పుల్లంపేట, సిద్దౌట్, రాయచోటి ప్రాంతాల వాణిజ్య కేంద్రంగా మారడానికి ఎంతో సహాయపడింది. ప్రాముఖ్యత కలిగిన ఈ మార్పు రాజంపేటను మండల కేంద్రంగా ఏర్పరచడానికి మొదటి దశగా పరిగణించబడింది, అంచలంచెలుగా ఎదుగుతూ
రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం (ఇప్పుటి రెవెన్యూ డివిజనల్ కార్యాలయం) 1915 సంవత్సరంలో 13 ఎకరాల స్థలంలో నిర్మించి కార్యకలాపాలు ప్రారంభమైంది. బ్రిటిష్ కాలంలో కడప జిల్లాలో కలెక్టరేట్ తర్వాత మొదటి సబ్ కలెక్టరేట్ గా రాజంపేట ఏర్పడింది. ఇది రాజంపేట, రైల్వే కోడూరు ఉమ్మడి నియోజకవర్గాలకు పరిపాలనా కేంద్రంగా పనిచేసింది. అటు తర్వాత బద్వేలు రాజంపేట రైల్వే కోడూరు లను కలుపుతూ పాలన ప్రారంభించారు. ఐతే రాజంపేట తెల్లదొరల పాలన నుంచి ప్రస్తుతం వరకు నూటా పదకొండు+ సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. రామ చంద్ర మూర్తి, టీ.ఎస్. రంగాచారి వంటి అధికారులు ఇక్కడ పనిచేసి ఉన్నారు. ఇప్పటివరకు అనేకమంది ఐఏఎస్ లు సబ్ కలెక్టర్లుగా పనిచేశారు.
రాజంపేట సబ్ కలెక్టరేట్ 1915లో ప్రారంభం కాగా 2015లో 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రస్తుతానికి రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయానికి 111 సంవత్సరంలు పూర్తయిన శతవసంతాలు వేడుకలు జరుపుకోవాలని అధికారులు తలపెట్టినా ఎటువంటి కారణాలు లేకుండానే వాయిదా పడ్డాయి. అయితే జీర్ణోద్ధరణ పనులు (1915 శిలాఫలకం) వేశారు కానీ పెద్ద ఎత్తున ఘన శత వార్షికోత్స వాలు జరగలేదని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. గత ఉమ్మడి కడప జిల్లా ఏర్పాటు అనంతరం జరిగిన విభజనతో ఉమ్మడిగా ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాలతొ కలిసిన వైభవాలు చవిచూచిన రాజంపేట రెవెన్యూ డివిజన్ కాలక్రమేనా కేవలం నాలుగు మండలాలకి పరిమితమైంది. జిల్లా కేంద్రంగా కావలసిన అన్ని అర్హతలు రాజంపేటకు ఉన్నప్పటికీ ఉన్నవాటినే నిర్వీర్యం చేస్తూ ఎంతో అపూర్వ చరిత్ర కలిగిన రాజంపేట ను చెప్పుడు మాటలకు లోనైన కొందరు రాజకీయ ప్రబుద్ధులు విచ్చల విడిగా మూడు ముక్కలుగా చీల్చి సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర పుటలకు ఎక్కారు. ఈ నేపథ్యంలో ఎంత చరిత్ర ఉన్నా ఏమి లాభం అని కొందరు అధికారులు పెదవి విరుస్తున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు..