08/03/2026
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు...
ముగ్గురు నిందితుల అరెస్ట్, రిమాండ్ కు తరలింపు...
అక్రమ సంబంధం తోనే హత్య..
స్థానిక సిద్ధార్థ కాంప్లెక్స్ లాడ్జిలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును వేములవాడ పట్టణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.ఈ కేసులో ప్రధాన నిందితురాలు బైరి శారద అలియాస్ కళ్యాణితో పాటు ఆమె భర్త బైరి శేకర్, సహకరించిన గుండం రవి అలియాస్ రవీందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ అంజనీనగర్లో నర్సుగా చేస్తున్న బైరి శారదకు, మృతుడు భూక్య మోహన్కు మధ్య అక్రమ సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ తరచూ డబ్బులు కావాలని శారదను వేధించడమే కాకుండా, వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించసాగాడు. ఈ వేధింపులు భరించలేక శారద తన భర్త శేకర్ తో కలిసి మోహన్ను వదిలించుకోవాలని పథకం రచించింది.ఈ క్రమంలో గుండం రవి అనే వ్యక్తి సహాయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన శారద పథకం ప్రకారం మోహన్ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్కు పిలిపించింది. అక్కడికి చేరుకున్న శేకర్, రవిలు కలిసి నైలాన్ తాడుతో మోహన్ గొంతు నులిమి హత్య చేశారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్, ఎస్ఐలు రామ్మోహన్, ప్రేమానందం, పిసిలు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాస్లను వేములవాడ డిఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు..