27/06/2024
నటులు:ప్రభాస్,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొణె,దిశా పటానీ
దర్శకుడు: నాగ్ అశ్విన్
సినిమా శైలి:Telugu, Sci-Fi
వ్యవధి:3 Hrs 1 Min
దృశ్యం రేటింగ్స్: 4.5 /5
కల్కి ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది.
కనుక కల్కి ఎవరు?
********************************************************
మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో పది అవతారాలను దశావతరాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాం. అలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన , పరుశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు.. ఇప్పటికే ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి. అంటే శ్రీమహా విష్ణువు పదవ అవతారమే ఈ కల్కి అన్నమాట.
భాగవతం, కల్కి పురాణం సహా అనేక గ్రంథాలలో కల్కి గురించిన వర్ణన ఉంది. అధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శ్రుతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం అన్నమాట. వీటిలో మూడు యుగాలు ఇప్పటికే ముగిశాయి. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం.
ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరం అయిన శంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతుంది. శంభలలో విష్ణు యశుడు- సుమతి అనే దంపతులుకి కల్కి జన్మిస్తాడని అంటారు. ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీ దేవి కూడా ఒక రూపంలో వస్తుంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బృహద్రధ వంశానికి చెందిన ఓ కుటంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీ దేవి అవతరిస్తుందని కల్కి పురాణంలో రాసుంది. ఇక కల్కి పుట్టిన తర్వాత ఆయన్ను కంటికి రెప్పలా కాపాడేందుకు ఆ ఆదిశక్తే రక్షకురాలిగా ఉంటుందని కూడా చెప్పారు. ఇక ఏడుగురు చిరంజీవుల్లో నలుగురు అయిన పరుశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శంభలకి వస్తారని కల్కి పురాణం చెబుతుంది. వీరు నలుగురూ కల్కికి ధర్మసంస్థాపనలో సహాయం చేస్తారట. వారే పుట్టిన ఆ పిల్లాడికి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. కలిని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని పురాణం చెబుతుంది. సింపుల్గా ఇది కల్కి కథ.
"అశ్వత్థామ హతః కుంజరః" అనే డైలాగ్తో కురుక్షేత్ర యుద్ధభూమిలో 'కల్కి 2898 ఏడీ' సినిమా మొదలైంది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి.. నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకొని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ (అమితాబ్ ). తనవాళ్లు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర (మాళవిక నాయర్) గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ (ఫేస్ చూపించలేదు) వస్తాడు. "రా కృష్ణ.. ఇక మిగిలింది నేనే నన్ను కూడా అంతం చేస్తావా" అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. వెంటనే పక్కకి తప్పుకొని "నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావ్ అశ్వత్థామ.. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావ్ కదా.. కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపం ఇస్తున్నాను.. ఇది శాపం ఎలా అనుకుంటున్నావేమో.. కలియుగాంతం వరకూ నువ్వు కొండ కోనల్లో ఇలానే తిరుగుతావ్.. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి.. అయినా సరే నీకు చావు దరిచేరదు" అంటూ అశ్వత్థామ నుదిటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు.
దీంతో దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అని అశ్వత్థామ ప్రాధేయపడతాడు. "సరే.. కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది.. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి.. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది.. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది.. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలికి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినా నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి.. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుంది." అంటూ కృష్ణుడు చెప్తాడు.
కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన 6 వేల సంవత్సరాల తర్వాత '2898 ఏడీ'లో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్నీ లాగేసుకొని 'కాంప్లెక్స్' (నగరం) అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్). కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీమ్ ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీ నగరంలో పురుగుల్లా చూస్తుంటారు సుప్రీమ్ సైన్యం. అయితే సంతాన ఉత్పత్తి ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్లోకి తీసుకెళ్లి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీమ్ ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ కే. సుప్రీమ్ యాస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తుంటారు. దాన్ని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సీరమ్ను కలెక్ట్ చేయాలనేది సుప్రీమ్ ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ ఆ కాంప్లెక్స్లోనే పని చేసే సుమతి (దీపిక పదుకొణె) మాత్రం 150 రోజులు దాన్ని ఎవరికీ తెలీకుండా మోస్తూ జాగ్రత్తపడుతుంది.
మరోవైపు ఏదైనా భౌంటీ (చేసే పనిని అలా పిలుస్తారు) వస్తే దానిని పూర్తి చేసి యూనిట్స్ (పనికి ఇచ్చే డబ్బు) దాచుకుంటూ ఉంటాడు భైరవ (ప్రభాస్). ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపు పని చేసే నిజాయతీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్లో సెటిలైపోవాలనేది భైరవ కోరిక. దీనికి తన కారు 'బుజ్జి' సాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్ను ఎదిరించి 'శంభల' అనే రహస్యమైన నగరంలో కొంతమంది పోరాటం చేస్తుంటారు. ఎప్పటికైనా భగవంతుడ్ని కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ల నమ్మకం. ఇక ఒకరోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరమ్ను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతిని శంభల మనుషులు కాపాడి వాళ్ల నగరానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించనంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై భౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్కి తీసుకురావడానికి అందరిలానే ఆశపడి భైరవ కూడా బయలుదేరతాడు.
అయితే భగవంతుడ్ని కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సూచన వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి కూడా తనకి చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడూ సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకెళ్లి యూనిట్స్ సాధిద్దామన్న భైరవ కల నెరవేరిందా? సుమతిని ఎతుకెళ్లడానికి వచ్చిన భైరవ-అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుడ్ని ప్రసవించిందా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నాగ్ అశ్విన్కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే...
భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఓ ఊహ. దాన్ని మనకి నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని.. పురాణాల్లో రాసున్నదానిపై పరిశోధన చేసి.. చాలా కష్టపడి మూడు సరికొత్త ప్రపంచాలను నాగ్ అశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, శంభల ఇలా మూడు మూడు రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్కి పరిచయం చేసేందుకు నాగ్ అశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫస్టాఫ్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాల కష్టాలు.. వీటి గురించే చూపించారు. అక్కడక్కడా కాస్త సరదా సంభాషణలతో ఫస్టాఫ్ సాగుతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓవైపు భైరవ.. మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్కి ఇస్తూ ఓ హై సీన్ అయితే పడింది. దీంతో ఆడియన్స్ను సెకండాఫ్లో భారీ యాక్షన్ చూసేందుకు నాగ్ అశ్విన్ ముందే రెడీ చేశారు.
ఇక సెకండాఫ్లో భైరవ-అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, యాక్షన్ ఆడియన్స్కి మంచి హై ఇచ్చింది. చావు అనేదే లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడ్రన్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఇలా సుమతిని తిరిగి కాంప్లెక్స్లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవల్లో ఉంది. ఇక క్లైమాక్స్లో ఎవరూ ఊహించని మరోస్థాయి ట్విస్ట్ను అయితే నాగ్ అశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్స్యే. థియేటర్లో సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎంతో ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూస్బంప్స్ వస్తాయి. ఇక క్లైమాక్స్లో పార్ట్ 2 గురించి హింట్ ఇస్తారని అంతా ముందే ఊహించారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు ఏకంగా 'కల్కి సినిమాటిక్ యూనివర్స్'యే ఉంటుందంటూ అందరికీ డైరెక్టర్ సర్ప్రైజ్ ఇచ్చారు.